● కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలం
● వైఎస్సార్సీపీ పాలకొల్లు కన్వీనర్ గోపి
యలమంచిలి: సాగునీటి శాఖ మంత్రి ఇలాకాలోనే సాగునీటికి కొరత ఏర్పడటం కూటమి ప్రభుత్వం వైఫల్యానికి తార్కాణమని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) విమర్శించారు. మండలంలోని మేడపాడులో నీరు లేక నారుమడులు ఎండిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నీరందని చేలను గోపి పరిశీలించారు. నారుమడి ఎండిపోయి బీటలు వారిన భూమిలో సైకిల్ తొక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతు లు మాట్లాడుతూ సాగు నీరివ్వడంలో కూటమి ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని వాపోయారు. రైతుల పక్షాన గోపి మాట్లాడుతూ స్వయంగా నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలోనే సాగునీటి కొరత ఏర్పడటం సిగ్గుచేటన్నారు. వర్షాలు పడవని వాతావరణ శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారని, అయితే వర్షాలు సాకుగా చెప్పి సాగు నీరివ్వకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అన్నారు. వ్యవసాయం, రైతులపై ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నిమ్మలకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవారన్నారు. నీరివ్వని పరిస్థితుల్లో ప్రభుత్వమే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు పరిహారం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే నారుమడులు వేసిన రైతులు ఎకరాకు రూ.5 వేల వరకు నష్టపోయారన్నారు. ఇకనైనా రైతులను మభ్యపెట్టకుండా వారికి వాస్తవ పరిస్థితి వివరించాలని గోపి డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్బాబు, నాయకులు ఇనుకొండ రవికుమార్, ఓదూరి భాస్కరరావు, కవురు గోపి, పాలంకి శ్రీనివాసరావు, గుర్రాల వెంకట్రావు, పాకా సూర్యనారాయణ, కుక్కల రామకృష్ణ, బొంతు వెంకట కర్ణారెడ్డి, వీరా ఉమాశంకర్, గణపాబత్తుల యేసుబాబు, గుడాల సురేష్, పితాని శ్రీను తదితరులు ఉన్నారు.


