ముస్లిం సమాజానికి వెన్నుపోటు
భీమవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో వక్ఫ్ ఆస్తులను కాపాడుతానని హామీ ఇచ్చి ఇప్పుడు ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ ఎండీ జహంగీర్ బాషా అన్నారు. భీమవరం కలెక్టర్ కార్యాలయం డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డికి ముస్లిం వక్ఫ్ ఆస్తులను కాపాడాలంటూ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జహంగీర్ బాషా, సభ్యులు వినతిపత్రం అందజేశారు. ముస్లిం ఆస్తులు కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ముస్లిం సమాజ ప్రయోజనాల కోసం దాతలు అల్లా పేరుతో ఇచ్చిన వక్ఫ్ ఆస్తుల భూములను కొల్లగొట్టేందుకే కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్కే నౌషద్ మొహిద్దీన్, ఎస్కే వలీబాషా, మెహర్ అన్సారీ, ఫహీమా, బాజీ, జిలాని, ఎండీ సిద్దిక్, రషీద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం: బీజీబీఎస్ మహిళా కళాశాల యాజమాన్యం చేస్తున్న అకృత్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తిని కోరారు. సోమవారం ఎమ్మెల్సీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కళాశాల సెక్రటరీ నూలి శ్రీనివాస్, యాజమాన్య పెద్దలు కళాశాల నుంచి నిబంధనలకు విరుద్ధగా తొలగించి, కళాశాల ఆస్తులు ఇష్టానుసారం అమ్ముకుంటున్నారన్నారు. గత 8 నెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను వేధిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు మహిళా అధ్యాపకులను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తున్నారని, కేసు పెట్టినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
భీమవరం: ఫిర్యాదిదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం అందిస్తామని అడిషనల్ ఎస్పీ వి.భీమారావు అన్నారు. భీమవరం వన్టౌన్ పోలీస్స్టేసన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అడిషనల్ ఎస్పీ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులు పూర్తిస్థాయిలో విచారించి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. సోమవారం నిర్వహించిన మొత్తం 18 అర్జీలు స్వీకరించారు.
ఏలూరు (టూటౌన్): ఈ నెల 12న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక, వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈనెల 12న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కార్మికులు వందలాది మందితో మున్సిపల్ ఆఫీసు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ఉరి తాళ్ల లాంటివని, వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ముస్లిం సమాజానికి వెన్నుపోటు


