లడ్డూపై దుష్ప్రచారాన్ని దేవుడు క్షమించడు
భీమవరం: తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి లెంపలేసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వేంకటేశ్వరస్వామి చూస్తూ ఊరుకోడని మాజీ మంత్రి కారుమూరి వెంకట నా గేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం భీమవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవాలనే దుర్బుద్ధితోనే ఏడాదిన్నరగా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ ఆరోపణలపై సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్వహించిన దర్యాప్తు సంస్థలు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని స్పష్టం చేసిన విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేయడం హేయమైన చర్యగా కారుమూరి అభివర్ణించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. సనాతన ధర్మమంటూ ప్రవచనాలు చేసే పవన్కల్యాణ్ గతంలో తాను కమ్యూనిస్టునంటూ, తనకు భక్తి లేదని బహిరంగ సభల్లో చెప్పిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. లడ్డూలో కల్తీపై సాక్షాత్తూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. లడ్డూ ప్రసాదం కోసం మాట్లాడే కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు తణుకులో యథేచ్ఛగా సాగుతున్న గోహత్య, గోవు మాంసం విక్రయాలు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. తణుకు నుంచి తరలిస్తున్న గోవు మాంసాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలే పట్టుకున్నా ఎటువంటి చర్యలూ లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా నెయ్యిని సరఫరా చేసిన డెయిరీలే జగన్ ప్రభుత్వంలోనూ సరఫరా చేశాయి తప్ప కొత్త సంస్థలు లేవనే విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. ఇప్పటికై నా లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పేరిచర్ల విజయనర్సింహరాజు, ఏఎస్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, భీమవరం పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, జల్లా కొండయ్య, ఇంటి సత్యనారాయణ, పాలవెల్లి మంగ, కోడే యుగంధర్, గంటా రాహుల్, బడుగు అశోక్బాబు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి


