కబ్జా కోరల్లో గ్రంథాలయ భవనం?
● జేసీబీతో కొంత భాగం పడగొట్టిన వైనం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన సెక్రటరీ, లేదంటున్న పోలీసులు
తణుకు అర్బన్: మండపాక గ్రంథాలయ భవనాన్ని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు యత్నించారు. పంచాయితీ కార్యాలయం సరిహద్దుకు చేర్చి ఉన్న గ్రంథాలయ భవనం చాలా కాలంగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. దీంతో ఆ భవన స్థలంపై కన్నేసిన అక్రమార్కులు ఈనెల 2వ తేదీన రాత్రి సమయంలో జేసీబీని తీసుకువచ్చి భవనం కూల్చివేత పనులు చేస్తుండగా స్థానికులు, అధికారులు అడ్డుకోవడంతో పనులు నిలిపివేశారు. ఈ ఘటనపై పంచాయితీ సెక్రటరీ శేఖర్ తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.
విలువైన స్థలం
మండపాక నడిబొడ్డు, కాలువ పక్కనే ఉన్న ఈ గ్రంథాలయ భవనం అత్యంత ఖరీదైన భూమిగా స్థానికులు చెబుతున్నారు. సుమారుగా 200 గజాల్లో ఉండే ఈ భవనం చాలా కాలంగా నిరుపయోగంగా ఉండడంతో ఆ స్థలంపై కన్నేసిన వారు పడగొట్టి కలుపుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా భవనాన్ని కొంతమేర పడగొట్టారని సమాచారం. ఈ వ్యవహారంలో పంచాయతీ సెక్రటరీ శేఖర్ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశానని మీడియాకు తెలిపారు. అయితే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ శ్రీనివాస్ మాత్రం సెక్రటరీ ఫోన్ ద్వారా తెలిపారే కానీ ఇంతవరకు ఎటువంటి రాతపూర్వకంగా ఫిర్యాదుచేయలేదని చెబుతుండడం వివాదాస్పదంగా మారింది. కేసు పెట్టానని సెక్రటరీ అనడం, లేదని పోలీసులు చెబుతుండడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని, ఈ స్థలం ఎవరికీ కలుస్తుంది, దీని వెనుక ఎవరున్నారనే విషయం తేలాల్సి ఉంది. గ్రామంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు దీని వెనుక ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
కబ్జా కోరల్లో గ్రంథాలయ భవనం?


