నయనానందకరం శ్రీవారి గ్రామోత్సవం
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగుతున్న శ్రీవారికి అడుగడుగునా భక్తులు హారతులు పట్టి, నీరాజనాలు సమర్పిస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన స్వామివారి గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ ప్రతి ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీవారికి భక్తులు హారతులిచ్చి, నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవం అనంతరం గుడి సెంటర్లోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు.
జంగారెడ్డిగూడెం: పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలతో ఈ కల్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరులతో కూడిన కల్యాణమూర్తికి ఐవీ రామాంజనేయులు ఇంటి వద్ద అభిషేకాలు విశేష అర్చన వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం శోభాయాత్రగా కల్యాణ వేదిక వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి ప్రత్యేక అలంకరణ చేసి గోదా పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా ఏర్పాటు చేసిన భక్తిసంగీత విభావరి భక్తులను అలరించింది. కార్యక్రమ వ్యాఖ్యాతగా బ్రహ్మశ్రీ ఈమని శశి కుమార్ శర్మ వ్యవహరించగా, ఎమ్మెల్యే ఎస్.రోషన్ కుమార్, రాజాన సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్రావు పాల్గొన్నారు.


