అనధికార భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలో ఉన్న అన్ని అనధికార భవనాలు, లేఅవుట్లను వెంటనే బీపీఎస్, ఐఆర్ఎస్ పథకాల ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని, లేనిచో స్థల, భవన యజమానులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాజమండి జి.సుబ్బారావు తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం టౌన్ ప్లానింగ్ సిబ్బంది, లైసెన్స్ సర్వేయర్లుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలతోపాటు నూతన విధానంలో వచ్చిన ఆన్లైన్ పద్ధతిలో భవన నిర్మాణ అనుమతులపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనలను ప్రజలకు తెలియజేయాలని, వాటిని పాటించే విధంగా కృషి చేయాలని లైసెన్స్డ్ సర్వేయర్లును కోరారు. పట్టణంలో ఇప్పటికే 400 వరకు బీపీఎస్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. 500లకు పైగా భవనాలను క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇన్చార్జి కమిషనర్ ఎం.రవి సుధాకర్, టీపీఏ రమణ, ఏసీపీ జి.సీతారం, టీపీఓ వి.జగదీశ్వరరావు, టౌన్ సర్వేయర్ రౌతు రామకృష్ణ, లైసెన్స్డ్ సర్వేయర్లు వరికూటి శ్రీను, శీతాపతి, రామకృష్ణ, ప్లానింగ్ కార్యదర్శలు పాల్గొన్నారు.


