సమాజంలో నాటికలది కీలక పాత్ర | - | Sakshi
Sakshi News home page

సమాజంలో నాటికలది కీలక పాత్ర

Apr 27 2025 12:54 AM | Updated on Apr 27 2025 12:54 AM

సమాజం

సమాజంలో నాటికలది కీలక పాత్ర

యలమంచిలి: సమాజంలోని రుగ్మతల్ని వేలెత్తి చూపడంలో నేటికీ నాటికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి చెప్పారు. కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి యూత్‌ క్లబ్‌ కళామందిరంలో 43వ జాతీయ స్థాయి నాటిక పోటీల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. సినిమాలు, టీవీ, ఓటీటీ వంటి మీడియా ప్రభంజనం సృష్టిస్తున్న నేటి రోజుల్లో కూడా నాటికలకు ఆదరణ లభించడం మంచి పరిణామం అన్నారు. కళలకు కాణాచి వంటి గోదావరి జిల్లాలో జన్మించడం తన అదృష్టమన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) మాట్లాడుతూ కొంతేరు ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఈ నాటిక పోటీలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయిని డాక్టర్‌ బాబ్జీ, కమిటి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, కొంతేరు యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ, కొంతేటి సర్వేశలింగం, గుండా రామకృష్ణ, ఉన్నమట్ల కబర్ది, బుద్దాల రామారావు, పులపర్తి రాజగోపాలరావు, వంగా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు అలరించిన నాటికలు

టెక్నాలజీ అవసరానికి వాడితే మిత్రుడు, అవసరానికి మించి వాడితే శత్రువు అని ‘నా శత్రువు’ నాటిక.. సమాజం బాగు కోసం కళాకారుల్లో ఉండే తపన రాజకీయ నాయకుల్లో ఉంటే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ‘ఆంగికం భువనం యస్య’ నాటికలోను.. జనరల్‌ బోగీలో ప్రయాణికుల కష్టాలు ఏ విధంగా ఉంటాయో ‘జనరల్‌ బోగీలు’ నాటికలోను వివరించారు. మూడు నాటికలు అలరించాయి. రెండవ రోజు నాటిక ప్రాంగణానికి బొండాడ వెంకట రాధా రమణ గుప్తా పేరిట నామకరణం చేశారు.

ఆకట్టుకున్న నాటికలు

భీమవరం: పట్టణంలోని గన్నాబత్తుల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీల్లో శనివారం మూడు నాటికలు రసవత్తరంగా సాగాయి. హైదరాబాద్‌ శ్రీమహతి క్రియేషన్స్‌ వారి సింహ ప్రసాద్‌ రచించగా.. ఉప్పలూరి సుబ్బరాయశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన ‘ఉక్కు సంకెళ్లు’ నాటిక ఈస్టిండియా కంపెనీ దురాగతాలను ఎత్తి చూపింది. ఫిలిప్స్‌ దొర అడిగిన వెంటనే హిల్సా చేప ఇవ్వలేదనే కోపంతో హుగ్లీ నదిలో చేపల వేట నిషేధిస్తే దానికి ఆనాటి జమిందారిణి రాణీ రాస్మణీదేవి ఏ విధంగా అడ్డుకున్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. రెండో ప్రదర్శనగా విశాఖ ఉక్కు నగరం శ్రీచైతన్య కళాస్రవంతి వారి ‘(అ)సత్యం’ నాటిక పి.బాలాజీ నాయక్‌ దర్శకత్వంలో ప్రదర్శించారు. కంటికి కనిపించేదంతా సత్యం కాదు, కనిపించనిదంతా అసత్యం కాదనే సందేశంతో ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. మూడో ప్రదర్శనగా హైదరాబాద్‌ మిత్రా క్రియేషన్స్‌ ‘ఇది రహదారి కాదు’ నాటిక ఎస్‌ఎం బాషా దర్శకత్వంలో ప్రదర్శించారు. సంపాదనే ముద్దు పిల్లలు వద్దు అనే రీతిలో నేటి యువత తీసుకుంటున్న నిర్ణయాలను, దారితప్పిన యువ జంటను చక్కదిద్దిన దృశ్యరూపమే ఈ నాటిక ఇతివృత్తం. కార్యక్రమంలో చైతన్య భారతి అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్‌, మంతెన రామ్‌కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

సమాజంలో నాటికలది కీలక పాత్ర 1
1/1

సమాజంలో నాటికలది కీలక పాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement