
పోలీస్ శాఖకు అత్యాధునిక డ్రోన్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని, నేరాలను నిరోధించటం, బాధితులకు న్యాయం చేయటమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లా పోలీస్ శాఖ సొంతం చేసుకుంటోందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం అవంతి ఫీడ్స్ సంస్థ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు రూ.8 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్ను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. ఐజీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే డ్రోన్ కెమెరాను పోలీస్ శాఖకు అందించటం అభినందనీయమన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అనేక కేసులను ఛేదించే క్రమంలో, నేరాలను నిరోధించేందుకు ఇలాంటి ఆధునిక డ్రోన్లు ఉపయోగపడతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాలకు వెలుపల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా మరింత పటిష్టం చేసే అవకాశం ఏర్పడిందన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక డ్రోన్ కెమెరాలను సమకూర్చుతున్నామని తెలిపారు. అవంతి ఫీడ్స్ సంస్థ డ్రోన్ను అందజేసి ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ పి.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
ఐజీకి అందజేసిన అవంతి ఫీడ్స్ అధినేత