హన్మకొండ: వినాయక చవితి, గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. ఉత్సవ నిర్వాహకులు పోలీస్, అధికారుల సూచనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే స్థానిక ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్, బారికేడ్లు, వైద్య సిబ్బందిని ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ ప్రజలు, ఉత్సవ కమిటీలు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ సమీప ప్రాంతాల్లో నిమజ్జన ప్రాంతాలను గుర్తించాలన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
ఉత్సవాల నిర్వహణపై
అధికారులతో సమావేశం


