రిటైర్డ్ ఐఏఎస్ కేకే ఛాత్రత్
కాజీపేట అర్బన్: కాకతీయుల వారసత్వ సంపద అద్భుతమని 1967 బ్యాచ్ ఒడిశా రిటైర్డ్ ఐఏఎస్ కె.కె.ఛత్రత్ అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని దక్షిణకాశీగా పేరుగాంచిన మెట్టురామలింగేశ్వరస్వామి ఆలయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఛత్రత్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మెట్టుగుట్టపై ఉన్న దొంతులమ్మ గుండాలను, జీడి గుండంలోని భీముడి పాదముద్రలను పరిశీలించి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. పురావస్తు కళాఖండాలను దర్శించుకోవాలనే కాంక్షతో ఓరుగల్లుకు విచ్చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, రఘుచందర్, అర్చకులు రాగిచేడు అభిలాష్ శర్మ, పరాశరం విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణశర్మ పాల్గొన్నారు.


