● కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు
ఆన్ చేయాలి
● హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి
కమలాపూర్: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. కమలాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో అభివృద్ధి ప్రణాళికలు, సమస్యలపై గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖల పని తీరును సమీక్షించారు. ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాళేశ్వరం వద్ద 5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోందని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగు నీటి అవసరాల కోసం కన్నెపల్లి పంప్హౌజ్ మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సమావేశం ద్వారా సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన బెల్టు షాపుల మూసివేత, గ్రామాల్లో తాగు నీటి సమస్య వంటి పలు సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి వచ్చే సమావేశంలోపు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు యూరియా బస్తాల కోసం ఇబ్బంది పడకుండా అసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని వ్యవసాయాధికారులకు సూచించారు. అనంతరం సర్పంచులను సన్మానించారు. సమావేశంలో డీటీడీఓ, మండల ప్రత్యేకాధికారి సత్యవతి, ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీ, పీఏసీఎస్ చైర్మన్ సంపత్రావు, ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, హౌసింగ్ డీఈ రవీందర్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


