సాక్షి వరంగల్: అల్లం, వెల్లుల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు నెలల్లో వీటి ధరలు సుమారు రెట్టింపవడంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. సరఫరా తగ్గడం, డిమాండ్ కొనసాగడం, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాత అల్లం కిలో రూ.240, పాత వెల్లుల్లి రూ.245కు విక్రయిస్తుండగా, మూడు నెలల క్రితం ఇవి రూ.120, రూ.160 మాత్రమే ఉన్నాయి. కొత్త అల్లం ధర రూ.70 నుంచి రూ.220కు, కొత్త వెల్లుల్లి రూ.80 నుంచి రూ.200కు చేరింది. దీంతో హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, గృహిణులు ఉన్నదానితోనే సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివిధ రాష్ట్రాలనుంచే దిగుమతులు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు అవసరమైన అల్లం, వెల్లుల్లి పూర్తిగా ఇతర రాష్ట్రాలనుంచే దిగుమతి అవుతోంది. అల్లం ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల నుంచి వస్తుండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వెల్లుల్లి దిగుమతి అవుతోంది. ఈ నిత్యావసర సరుకు ముందుగా వరంగల్ బీట్ బజార్ మార్కెట్కు చేరుకుని, అక్కడినుంచి హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రవాణా అవుతోంది.
రోజుకు 130 క్వింటాళ్ల విక్రయాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజూ సుమారు 130 క్వింటాళ్ల అల్లం, వెల్లుల్లి విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లాలో రోజుకు సుమారు 10 క్వింటాళ్లకు పైగా అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం రోజుకు దాదాపు రూ.35 లక్షల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. ధరలు ఇలానే కొనసాగితే దసరా నాటికి వెల్లుల్లి ధర కిలో రూ.400 వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.
మూడు నెలల్లోనే రెట్టింపు
ఉమ్మడి వరంగల్లో రోజుకు రూ.35 లక్షల వ్యాపారం


