న్యూశాయంపేట: విపత్తు సమయంలో స్వీయరక్షణ, ప్రాథమిక చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన కార్యక్రమాల నిర్వహణపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అవసరమైన సమాచారం, సహకారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఇన్స్పెక్టర్ దీపక్కుమార్ నేతృత్వంలోని కే.వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సతీష్కుమార్ బృందం సభ్యులు అత్యవసర పరిస్థితులపై స్పందించే విధానంపై ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు.
భూ రీసర్వేను పక్కాగా చేపట్టాలి
భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతాంశంగా, పక్కాగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో భూ రీసర్వే, ఇందిరమ్మ, ఇళ్లు, సాదా బైనామా దరఖాస్తులు, తదితర అంశాలపై సమీక్షించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కలెక్టర్ సత్యశారద సమీక్ష


