హన్మకొండ అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గురుకుల విద్యాలయాల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆర్బీఎస్కే, ఐడీఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, దోమల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో యూరియా, నీటి కొరత లేదు
‘వరంగల్, హనుమకొండ జిల్లాల్లో యూరియా కొరత లేదు. రానున్న 90 రోజుల పాటు తాగునీటి ఇబ్బందులు ఉండవు’ అని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిస్థితులను ఆయనకు వివరించారు.
దొడ్డి కొమురయ్య ఆశయాలు ఆదర్శం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మానస రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
భీమారంలో టీబీ ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్
హసన్పర్తి: క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భీమారం పాత గ్రామపంచాయతీ ఆవరణలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్షయ–ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సందర్శించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మదన్మోహన్రావు, ట్రెయినీ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ రోహిత్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, వైద్యాధికారులు డాక్టర్ భరత్, డాక్టర్ మానస, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, టీబీ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్య వర్ధంతి
న్యూశాయంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈసందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా అధికారులు, మాజీ కార్పొరేటర్ మరుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో
పనిచేయాలి
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్పాయ్


