● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలోని ప్రతి సీడీపీఓ తన పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాలపై సీడీపీఓలు, సంక్షేమాధికారితో గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీడీపీఓలు నెలకు కనీసం 150 కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. కొందరు సీడీపీఓలు విధుల్లో నిర్లక్ష్యం వహించడం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లను అభినందించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
గంజాయి తరలిస్తున్న తపాలా ఉద్యోగి అరెస్ట్
ఖానాపురం: గంజాయి తరలిస్తున్న తపాలా శాఖ ఉద్యోగిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం అరెస్టు వివరాలను ఎస్సై వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పుట్టలభూపతికి చెందిన మాలోత్ కల్యాణ్ తపాలా శాఖ ఉద్యోగి. బుధవారం 2.38 కిలోల (రూ.1,01,900 విలువ) గంజాయిని హనుమకొండలో విక్రయించడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అశోక్నగర్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి నుంచి గంజాయి, సెల్ఫోన్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయిని రవాణా చేస్తున్న కల్యాణ్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.


