● శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
● కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమి షనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
అమ్మవారికి
సీపీ శ్వేత పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని బుధవారం వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆమెను ఘనంగా స్వాగతించారు. సీపీ శ్వేత అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కమిషనర్ వెంట ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత తదితరులు ఉన్నారు.


