కమలాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మూడు విడతల రైతుభరోసా ఇవ్వలేదని, ఎన్నికల్లో గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కమలాపూర్ మండలంలోని 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు హామీ మేరకు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, యాప్ రైతులకు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కీలకమో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ తౌటంఝాన్సీ, తహసీల్దార్ సురేశ్, ఆర్ఐ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి


