● జిల్లా వ్యవసాయశాఖ అధికారి
విజయనిర్మల
దుగ్గొండి: జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు యాప్లో బుక్ చేసుకుని యూరియా తీసుకోవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల అన్నారు. మండల పరిధిలోని గిర్నిబావిలో పలు విత్తన, ఎరువుల దుకాణాలను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల వివరాలను పరిశీలించారు. యాప్లో యూరియా బుక్ చేసుకున్న వారికి అందించారా లేదా అనే వివరాలను యాప్లో తనిఖీ చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొంత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. భూమి సరిపడా తడిసిన తర్వాతనే విత్తనాలు వేయాలని సూచించారు. రైతుబరోసా కోసం రైతులు తమ వివరాలను ఏఈఓ లకు అందించాలన్నారు. గతంలో అన్ని సరిగా ఉండి అకౌంట్లలో డబ్బులు జమకాని వారు, కొత్తగా పాస్బుక్లు వచ్చిన వారు జులై 5వ తేదీలోగా తమ వివరాలను అందించాలని సూచించారు. పీఎం కిసాన్ కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఏఓ సూచించారు. ఆమె వెంట ఏఓ గాజుల శ్యామ్, ఏఈఓలు హన్మంతు, విజయ్నాయక్ ఉన్నారు.


