జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న | - | Sakshi
Sakshi News home page

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి

చాహత్‌ బాజ్‌పాయ్‌ ఇక రిలీవ్‌

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా తేజావత్‌ వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏలో జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా (కోర్‌ అర్బన్‌ రీజియన్‌–మెట్రో రైలు) కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌గా సుమారు సుమారు 8 నెలు పనిచేసిన చాహత్‌ బాజ్‌పాయ్‌కు హనుమకొండ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ప్రభుత్వం బల్దియాకు కమిషనర్‌ను నియమించకపోవడంతో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆమెకే జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు అప్పగించారు. జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా కొనసాగుతున్న చాహత్‌ బాజ్‌పాయ్‌ని ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది.

వెంకన్న మరిపెడ వాసి

కొత్త కమిషనర్‌ తేజావత్‌ వెంకన్న మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన వారు. 2007లో గ్రూప్‌–1 అధికారి (మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌)గా ఎంపికయ్యారు. బోధన్‌, మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీలోని చందానగర్‌, శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీలోనే సౌత్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌గా సేవలందించారు. ప్రస్తు తం హెచ్‌ఎండీఏ జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, నగరపాలన, ప్రజాసేవల మెరుగుదలలో అనుభవం కలిగిన వెంకన్నను ప్రభుత్వం తాజాగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించింది. ఆయన నేడో రేపో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement