● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి
గీసుకొండ : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15, 16వ డివిజన్లలో హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయ్, మాజీ మేయర్ గుండు సుధారాణితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. 16వ డివిజన్లోని కీర్తి నగర్లో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్క్, ధర్మారంలోని గరీబ్ నగర్లో రూ.11 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచి నీటి పైపు లైన్ నిర్మాణ పనులకు, మొగిలిచర్ల ప్రాంతంలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు, రెడ్డిపాలెంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


