ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని బుధవారం రాత్రి 10.30 గంటలకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై ఆరా తీశారు. బియ్యం, కూరగాయలు, బియ్యం స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. హాస్టల్లో సౌకర్యాలు, మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ సమయానికి, సరైన ప్రమాణాలతో అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా కంప్లైంట్ బాక్స్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఒత్తిడికి లోనుకాకుండా క్రమ శిక్షణతో చదువుకోవాలని సూచించారు. ప్రత్యేక ట్యూటర్ను నియమించి అదనపు పాఠాలు బోధించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తనిఖీల్లో జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమాధికారి పుష్పలత, హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


