ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఆత్మగౌరవం
పరకాల: ‘ఏ కులం, ఏ మతం.. ఇల్లిస్తే ఓటేస్తావా అని ప్రజలను అడగం.. పేదవారైతే ఇళ్లు మంజూరు చేయాలన్న గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నాం.. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథక ంతో పేదల ఆత్మగౌరవం నిలబెట్టాం’ అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాలలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ప్రచార సభ నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఎన్నికల తర్వాత పరకాలకు గోదావరి జలాల తరలింపు కోసం రూ.38 కోట్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పరకాల నడిబొడ్డున ఇంటిగ్రేటెడ్ స్కూల్ను పట్టుబట్టి సాధించుకున్నారని తెలిపారు. నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇళ్లు, పరకాల మున్సిపాలిటీకి 405 ఇళ్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. మిగిలిన వారికి రెండో విడత ఏప్రిల్లో మంజూరు చేస్తామని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిలిచిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పరకాలలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ


