జోరందుకున్న ‘పుర’పోరు..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉంది. 9న ప్రచారానికి తెరపడనుండగా మధ్యలో ఐదురోజులే మిగలనుంది. దీంతో నామినేషన్లు వేసినప్పటి నుంచే కొందరు అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేయగా.. మరికొందరు ‘బి’ఫామ్లు పొందిన తర్వాత జోరును పెంచారు. బుధవారం నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఏఐఎఫ్బీ తదితర పార్టీలు, స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ‘పుర’ పీఠాలు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. ఆ పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్)లను నియమించింది. వారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను కలుపుకుని సమన్వయం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకులు పి.విశ్వనాథన్ ఉమ్మడి జిల్లాలో బుధవారం పర్యటించగా.. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జేఎస్ భూపాలపల్లి గణపురం మండలంలో ఏర్పాటు చేసే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 12 మున్సిపాలిటీలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేశ్ తదితరులు అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేస్తున్నారని, త్వరలోనే వారి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


