గాంధీ పేరు తొలగించడం అన్యాయం
వరంగల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం అన్యాయమని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ఖాన్ అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, మరో కార్యదర్శి విశ్వనాథన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ కేంద్రం ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడుస్తోందని, దీనిపై గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈవిషయంపై పూర్తిస్థాయిలో పార్టీ పరంగా ఉద్యమించేందుకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
పాకాలలో
మొసలి వదిలివేత
ఖానాపురం: మండలంలోని పాకాల సరస్సులో మొసలిని గురువారం ఫారెస్ట్ సిబ్బంది వదిలివేశారు. గూడూరు మండలంలోని సీతానగర్ గ్రామ పంటపొలాల్లో మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో మొసలిని బంధించి పాకాలకు తీసుకువచ్చి వదిలివేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది విజయ్, వెంకటేశ్వర్లు, బోజ్య, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
హౌసింగ్ బోర్డు ఇన్చార్జ్ ఏఈఓగా వాసు
వరంగల్: తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్(ఏఈఓ)గా పీఆర్వో వి.వాసుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఏఈఓ సెలవులో ఉన్నందున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ డివిజన్కు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజలు వాసును సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉన్నత విద్యతో
ఉజ్వల భవిష్యత్ : డీసీపీ
నర్సంపేట: ఉన్నత విద్యనభ్యసిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ సూచించారు. ఈ మేరకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో సీయు గేట్ ప్రవేశ పరీక్ష–ఉన్నత విద్య అవకాశాలు అనే అంశంపై గురువారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్కుమార్ మాట్లాడుతూ తనకు సివిల్స్పై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనే అవగాహన కలిగిందని తెలిపారు. ప్రిన్సిపాల్ మల్లం నవీన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయాల విద్యపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. వైస్ ప్రిన్సిపల్ బైరి సత్యనారాయణ, అకడమిక్ కోఆర్డినేటర్ కందాల సత్యనారాయణ, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, స్టాఫ్ సెక్రటరీ ఎంఎంకే రహీముద్దీన్, ఎం.సోమయ్య, ఎం.రాంబాబు, రాజీరు, గాయత్రి, ఎస్.రజిత, సంధ్య, భద్రు భూక్య, పీడీ రమేశ్, పూర్ణచందర్, గ్లోరీ, మాధవి, నిజాం, రాకేశ్, సతీశ్, దివ్య, స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు.
అదృశ్యమైన వ్యక్తి మృతి
పర్వతగిరి: కల్లెడ గ్రామంలో అదృశ్యమైన అకారపు రాములు (50) మృతి చెందాడు. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం. రాములు ఈనెల 6వ తేదీన కూలి పనికివెళ్లి ఇంటికి వచ్చాడు. అనంతరం తిరిగి రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. దీంతో రాములు ఎంతకూ రాకపోవడంతో భార్య కళావతి పోలీసుకు ఫిర్యాదు చేసింది. కాగా, గ్రామం మధ్యన ఉన్న వాగులో రాములు మృతదేహాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పాత బ్రిడ్జిపై నుంచి సైకిల్తో సహా వాగులోని పెద్ద బండరాళ్లపై పడడంతో రాములు అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు.
గాంధీ పేరు తొలగించడం అన్యాయం
గాంధీ పేరు తొలగించడం అన్యాయం


