
పొద్దటినుంచే బారులు
● యూరియా కోసం రైతుల పడిగాపులు
● పలుచోట్ల పోలీస్ పహారా మధ్య పంపిణీ
● సరిపడా బస్తాలు రాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్న రైతులు
నర్సంపేట: యూరియా కష్టాలు తీరడం లేదు. ఉదయం నుంచే గోదాంల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామపంచాయతీ, పాపయ్యపేట గ్రామాలలోని సొసైటీ గోదాముల వద్ద ఆదివారం పడిగాపులు కాశారు. అమీనాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో టోకెన్లు ఇస్తున్నారన్న విషయం తెలుసుకొని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. రైతులు భారీగా తరలిరావడంతో పోలీ సుల పహారా మధ్య యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. రైతులు ఆందోళన చెందవద్దని, యూరియాను తెప్పించి అందజేస్తామని చెన్నారావుపేట, అమీనాబాద్ సొసైటీ చైర్మన్లు చింతకింది వంశీ, మురహరి రవి తెలిపారు.
నర్సంపేట మండలంలో..
నర్సంపేట రూరల్ : మండలంలోని కమ్మపల్లి గ్రామంలో యూరియా లారీ వచ్చిందనే సమాచారం రావడంతో ఆదివారం ఒక్కసారిగా మండలంలోని పలుగ్రామాల నుంచి సొసైటీ గోదాం వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. నర్సంపేట ఎస్సై రవికుమార్ పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకోని రైతులకు తొక్కిలాటకాకుండా క్యూలైన్లో నిలబెట్టించారు. లోడ్ అయిపోవడంతో కొంతమంది రైతులు వెనుదిరిగి పోయారు.
ఖానాపురంలో..
ఖానాపురం: మండలంలోని అశోక్నగర్ సొసైటీ గోదాముకు శనివారం సాయంత్రం 444 బస్తాలు వచ్చాయి. ఆదివారం ఉదయం 444 బస్తాల యూరియా వచ్చింది. దీంతో రైతులు ఉదయం 3.30 గంటల నుంచే టోకెన్ల కోసం రైతువేదిక వద్ద బారులు తీరారు. వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ అధికారులు అశోక్నగర్కు చేరుకుని టోకెన్లు అందజేశారు. ఎస్సై రఘుపతి సిబ్బందితో పర్యవేక్షణ చేపట్టారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట: పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేస్తారని అధికారులు సమాచారం ఇవ్వడంతో భారీగా రైతులు రైతువేదిక వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పడిగాపులు కాస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.
సంగెంలో..
సంగెం: మండలంలోని నల్లబెల్లి, పల్లారుగూడ గ్రామాల్లో పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ ఆదివారం చేశారు. సంగెం సొసైటీ పరిధిలో నల్లబెల్లి, ఊకల్ సొసైటీ పరిధిలో పల్లారుగూడ గ్రామాల్లో 444 బస్తాల చొప్పున యూరియా వచ్చినట్లు తెలుసుకుని తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు.
నెక్కొండలో..
నెక్కొండ: నెక్కొండ సొసైటీ గోదాం వద్ద ఆదివారం ఉదయం 6 గంటలనే రైతులు బారులు తీరారు. విషయం తెలుసుకున్న ఏఓ నాగరాజు, పోలీసులు అక్కడి చేరుకుని క్యూలైన్లో ఉంచి రైతులకు యూరియా అందించేలా చర్యలు తీసుకున్నారు.

పొద్దటినుంచే బారులు

పొద్దటినుంచే బారులు

పొద్దటినుంచే బారులు