
డెంగీ.. పంజా
ఎంజీఎం :సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ జ్వరాలు పంజా విసురుతున్నాయి. కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు ప్రారంభం నుంచి నేటి వరకు విషజ్వరాలతో బాధపడుతూ ఔట్ పేషంట్లు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్న క్రమంలో ఇన్పేషంట్గా 1,522 మంది అడ్మిట్ అయ్యారు. ఇందులో 59మంది బాధితులకు డెంగీ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. కాకతీయ మెడికల్ కళాశాల కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్య లోపం హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు డెంగీ బారిన పడుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఓ పీజీ వైద్యుడితో పాటు నర్సింగ్ విద్యార్థులు సైతం డెంగీ బారినపడ్డారు. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన బుచ్చిమల్లు–కవిత దంపతుల కుమార్తె సాత్విక (9) విషజ్వరంతో బాధపడగా ఎంజీఎం ఆస్పత్రికి తీసుకు రాగా డెంగీ బారినపడి ఇటీవల మృతి చెందింది.
వైద్య విద్యార్థులకు తప్పని తిప్పలు..
ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవలు అందించే వైద్య విద్యార్థులు కాకతీయ మెడికల్ కాలేజీలోని హాస్టళ్లలో ఉంటూ చదువుతున్నారు. పది రోజులుగా హాస్టల్స్ పనిచేసే కార్మికులకు వేతనాలు రాకపోవడంతో విధులు బహిష్కరించి వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి చెత్త్తాచెదారం పేరుకుపోయి దోమల ఉధృతి పెరగడంతో వైద్యవిద్యార్థులు సైతం విషజ్వరాల బారిన పడుతున్నారు. అధికారికంగా ఓ పీజీ వైద్యుడికి డెంగీ పాజిటివ్గా నిర్ధారణ కాగా, పదుల సంఖ్యలో వైద్యవిద్యార్థులు విషజ్వరాలబారిన పడి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు..
ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో 8 మంది డెంగీబారిన పడి చికిత్స పొందుతున్నారు.వీరితో పాటు ఒకరు మలేరియాతో బాధపడుతుండగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
కిక్కిరిసిపోతున్న ప్రైవేట్ ఆస్పత్రులు..
సీజనల్గా విజృంభించే విషజ్వరాలతో ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కిక్కిరిసిపోతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎంజీఎంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంలేని వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందుతున్నారు.
డెంగీబారిన కేఎంసీ వైద్యవిద్యార్థులు
చికిత్స పొందుతున్న
ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
ఎంజీఎంలో 20 రోజుల్లో
59 మందికి డెంగీ నిర్ధారణ