
డెంగీ డేంజర్బెల్స్
సాక్షి, వరంగల్: జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు 56 డెంగీ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోనే 28వరకు కేసులు అంటే దాదాపు 50 శాతం కేసులు ఉండడం నగరవాసులను కలవరానికి గురిచేస్తోంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఒక్క ఆగస్టులోనే 18వరకు డెంగీ కేసులు వస్తే వీటిలో తొమ్మిది కేసులు వరంగల్ నగరం నుంచే ఉండడం ఇక్కడా వ్యాధి తీవ్రత ఎలా ఉందో గణాంకాలే చెబుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వరంగల్ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉండడంతో దోమలు విజృంభించి వ్యాధి వ్యాప్తి ఎక్కువవుతోంది. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. డెంగీ దోమలు పెరిగేందుకు కారణమయ్యే మంచినీటి నిల్వలు, తాగేసిన కొబ్బరి బొండాలు, ఖాళీ సీసాలు, పూలకుండీలు, పాతటైర్లు అలాగే వదిలేయడంతో సమస్య తీవ్రమవుతోంది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం లోపించడం, బ్లీచింగ్, ఫాగింగ్ చర్యలు నామమాత్రంగా ఉండడంతో దోమల వృద్ధి పెరిగింది. అయితే జిల్లా వైద్యారోగ్య గణాంకాలు డెంగీ కేసుల సంఖ్య 56 అ ని చెబుతున్నా, ఇంకా లెక్కలోకి రాని డెంగీ కేసులు ఎక్కువగానే ఉన్నట్టు పరిస్థితిని బట్టి తెలుస్తోంది. సత్వర చికిత్స కోసమంటూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన వారు ఉన్నారు. దోమల వ్యాప్తితో రోగాలు వస్తున్నాయని, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడంటే..
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు నమోదైన డెంగీ కేసుల్లో 56 ఉంటే వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో సగం వరకు ఉన్నాయి. బానోజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు, చెన్నారావుపేట పీహెచ్సీలో మూడు, దుగ్గొండి పీహెచ్సీలో ఐదు, ఖానాపూర్ పీహెచ్సీలో ఎనిమిది, మేడిపల్లి పీహెచ్సీలో ఒకటి, నెక్కొండ పీహెచ్సీలో రెండు, పర్వతగిరి, రాయపర్తి, సంగెం పీహెచ్సీలలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి.
గ్రేటర్లో హాట్ స్పాట్లు ఎక్కడంటే..
వరంగల్ నగరంలో కీర్తినగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అత్యధికంగా ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి. దేశాయిపేట యూపీహెచ్సీలో మూడు, ఫోర్ట్ వరంగల్ యూపీహెచ్సీలో రెండు, రంగశాయిపేట యూపీహెచ్సీలో రెండు, ఎంజీఎంలో మూడు, సీకేఎం యూఎఫ్డబ్ల్యూసీలో ఐదు, చింతల్ యూపీహెచ్సీలో ఒకటి, కాశీబుగ్గ యూపీహెచ్సీలో ఒకటి, పైడిపల్లి యూపీహెచ్సీలో ఒకటి, గీసుగొండ పీహెచ్సీలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆగస్టులో నమోదైన 18 డెంగీ కేసుల్లో తొమ్మిది కేసులు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. కీర్తినగర్ యూపీహెచ్సీలో నాలుగు, రంగశాయిపేట యూపీహెచ్సీలో ఒకటి, పైడిపల్లి యూపీహెచ్సీలో ఒకటి, సీకేఎం యూఎఫ్డబ్ల్యూసీలో ఒకటి, ఎంజీఎంలో ఒకటి, గీసుగొండ పీహెచ్సీలో ఒకటి నమోదైంది.
డెంగీ పెరుగుతోంది ఇలా..
జిల్లాలో యాభై దాటేసిన కేసులు
జనవరి నుంచి ఇప్పటివరకు 56 ..
ఆగస్టులోనే అత్యధికంగా 18 ..
వీటిలో సగానికిపైగా గ్రేటర్ వరంగల్లోనే
వర్షాలతో అమాంతం పెరుగుతున్న కేసులు
జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యాధికారులు
లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి..
డెంగీ సాధారణ జ్వరంగా మొదలవుతుంది. 100 నుంచి 104 డిగ్రీల ఫారన్హీట్ వరకు జ్వరం ఉంటుంది. చలి, వణుకు, తీవ్రమైన తలనొప్పి, కంటి వెనుకభాగంలో నొప్పి, ఒళ్లు నొప్పులు, నడుంనొప్పి, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. రెండు మూడురోజులకు మించి ఈ లక్షణాలు ఉంటే డెంగీ జ్వరంగా భావించాలి. తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలోని వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగీ పాజిటివ్ అని తేలినా హైరానా పడొద్దు. డెంగీ వచ్చినప్పుడూ ప్లేట్లెట్స్ పడిపోవడం సర్వసాధారణం. కౌంట్ సంఖ్య చూసి ఆందోళన చెందొద్దు. వైద్యుడి సూచించి మేరకు మెడిసిన్ వాడాలి.
– డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్యారోగ్య విభాగాధికారి

డెంగీ డేంజర్బెల్స్

డెంగీ డేంజర్బెల్స్

డెంగీ డేంజర్బెల్స్