
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే
అవకాశం
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పలు పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికీ చెరువులు, వాగులు, వంకలు తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగకుండా రోడ్డు మార్గాలను డైవర్ట్ చేయాలన్నారు. ఇందుకు పోలీసు, గ్రామ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని, శిథిలావస్థలో ఉన్న గృహాలు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. డ్రైనేజీలను మరమ్మతు చేయాలని, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా డ్యాంలు, చెరువుల స్థితిగతులను నిరంతరం పరిశీలించాలని, ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈనెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల స్థాయి టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు సెలవులో వెళ్లకుండా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటూ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. డెంగీ, చికున్గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, ఇరిగేషన్ ఈఈలు శంకర్, సునీత, జిల్లా ఆర్అండ్బీ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు.