వనపర్తి: సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ప్రజల హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన గొప్ప యోధుడిగా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని.. తన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావంతో నాటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఆయన చూపిన ధైర్యం, సమానత్వం, ఆత్మగౌరవం వంటి విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న జీవితంపై సామాజిక చైతన్య కళాకారుడు రాజారాం ప్రకాష్ పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇన్చార్జ్ బీసీ సంక్షేమశాఖ అధికారి మధు, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, వనపర్తి పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ నాయకులు గంధం నాగరాజు, వెంకటేష్, గౌడ సంఘం నాయకులు, ఇతర ప్రజాసంఘాల, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


