వనపర్తి: వనపర్తి కాంగ్రెస్లో పుట్టిన వర్గపోరు చిలికి చిలికి గాలివానలా పెరుగుతోంది. ఎమ్మెల్యే, ఆయన వర్గం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, రేపు ఢిల్లీలో ఏఐసీసీకి ఫిర్యాదులు చేస్తుండటంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందోనన్న ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారెడ్డి బీఆర్ఎస్తో అండగాగుతున్నారని, పీఏల కాల్డెటా పరిశీలించాలంటూ ఎమ్మెల్యే కాంగ్రెస్ పెద్దలకు అందజేసే ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్లలో కొందరు నాయకులు లేవనెత్తిన చిన్నారెడ్డి హటావో.. కాంగ్రెస్ బచావో అనే నినాదం మరోమారు మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ప్రతిధ్వనించాయి. ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గం పెద్దఎత్తున గాంధీభవన్కు చేరుకొని నినాదాలు చేశారు. కన్నతల్లి లాంటి పార్టీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం కోరామని.. అనుమతిస్తే వివాదానికి గల కారణాలను వివరించనున్నట్లు తెలిపారు. పార్టీకి నష్టం కలిగించేలా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా పదే పదే అనుచిత వాఖ్యలు చేయడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో కేడర్ను రెండుగా చీల్చేలా, విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని.. వారి ఆదే శాల మేరకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వర్గీయులు


