
పౌర సేవలకు అధిక ప్రాధాన్యం
కొత్తకోట రూరల్: పౌర సేవలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, సమస్యలను శ్రద్ధగా ఆలకించి త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దమందడి మండలంలో ఆయన పర్యటించారు. మొదట మోజర్లలో నిర్మిస్తున్న పారాబాయిల్డ్ రైస్మిల్లును పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తేనే మిల్లుల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేస్తామని యజమానికి సూచించారు. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. రైతులకు సరైన మద్దతు ధర లభించడంలో ఇలాంటి మిల్లులు కీలక పాత్ర పోషిస్తాయని.. అయితే పర్యావరణ పరిరక్షణకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భూ భారతి రెవెన్యూ సదస్సుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంతో ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపర్చవచ్చని తెలిపారు. అనంతరం రికార్డు గదిని సందర్శించి నిర్వహణను పరిశీలించారు. అన్ని రికార్డులను సక్రమంగా, భద్రంగా నిర్వహించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీసీఎస్ఓ కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ సరస్వతి, ఇతర అధికారులు ఉన్నారు.