
నేడు జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు శుక్రవారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ప్రధానకార్యదర్శి కురుమయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే యువ తెలంగాణ కబడ్డీ ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఈ ఎంపికలు నిర్వహిసున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల క్రీడాకారులు సాయంత్రం 4 నుంచి ప్రారంభించే ఎంపికల్లో పాల్గొనాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్ 85001 65900 సంప్రదించాలని సూచించారు.
పేదలందరికీ
సంక్షేమ ఫలాలు
గోపాల్పేట: కాంగ్రెస్ పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. కొండలు, ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేశారని ఆరోపించారు. తాను కేవలం ప్రజల కోసం పని చేస్తున్నానని.. ఎన్నికల ముందు ప్రకటించిన ఆస్తులు, ఎన్నికల తర్వాత తన ఆస్తులు చూపిస్తానని తెలిపారు. మూడు మండలాల్లో మొత్తం 3,500 రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సులు నడిపిస్తున్నామని.. పెట్రోల్బంకు నిర్వహణ సైతం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పనిని గుర్తించి ఓట్లు వేయాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. రేషన్కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియని.. ప్రతి మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఇన్చార్జ్స సత్యశిలారెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు వెంకటేష్, పీఏసీఎస్ చైర్మన్ రఘు, మూడు మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సబ్స్టేషన్ నిర్మాణానికిస్థల పరిశీలన
పాన్గల్: మండలానికి మంజూరైన 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గురువారం మండలంలోని గోప్లాపూర్, కిష్టాపూర్లో ఆర్డీఓ సుబ్రమణ్యం మండలస్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోప్లాపూర్ శివారు సర్వేనంబర్ 61, కిష్టాపూర్ శివారులోని సర్వే నంబర్ 32ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి సుమారు 10 ఎకరాల స్థలం అవసరమవుతుందని.. పక్కపక్కనే ఉన్న ఈ రెండు సర్వేనంబర్లలో నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని పేర్కొన్నారు. ఆర్డీఓ వెంట ఇన్చార్జ్ తహసీల్దార్ అబ్రహంలింకన్, ఆర్ఐ మహేష్, సర్వేయర్ ఇలాయత్, జూనియర్ అసిస్టెంట్ మహేష్, మల్లేష్ తదితరులు ఉన్నారు.
బుద్దారం చెరువుకు గండి
గోపాల్పేట: మండలంలోని బుద్దారం పెద్ద చెరువు (మినీ రిజర్వాయర్) అలుగు వద్ద గురువారం కట్ట తెగింది. రైతులు వెంటనే నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకొని పొక్లెయిన్తో మట్టి వేసి మూసివేశారు. ఈ విషయాన్ని కేఎల్ఐ డీఈ గఫార్ వద్ద ప్రస్తావించగా.. గుర్తు తెలియని వ్యక్తులు గేట్ ఎక్కువ తెరవడంతో కొంత కట్ట తెగిందన్నారు. సిబ్బంది వెంటనే స్పందించి కట్టను పునరుద్ధరించారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నేడు జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు

నేడు జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు