● 150 ప్రాంతాలు.. 800 మంది పోలీసులు ● స్వీయపర్యవేక్షణ చేసిన ఎస్పీ
విజయనగరం టౌన్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ ఎఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ముందుగా గుర్తించిన 150 ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రహదారి భద్రత, హెల్మెట్ ధారణ పట్ల అవగాహనే లక్ష్యంగా పట్టణంలో ఆకస్మికంగా వాహన తనిఖీలను చేపట్టి, స్వీయపర్యవేక్షణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వాహన తనిఖీలను చేపట్టేందుకు 150 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. తనిఖీల్లో 800 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వినియోగించామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలను వాహనదారులకు వివరించి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు సరైన ఇన్సూరెన్స్ లేకుంటే కలిగే అనర్ధాలను వాహనదారులకు వివరించి, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని సూచించామన్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఈ చలానా విధించేందుకు బదులుగా వెంటనే ఆయా వాహనాలకు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చేయించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. తనిఖీల్లో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


