● ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ సూర్యప్రకాష్
పార్వతీపురం రూరల్: ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లకు ఉద్దేశించిన రూఫ్టాప్ సోలార్ పనులను శరవేగంగా సాగించి, నిర్దేశించిన గడువులోపు వంద శాతం పూర్తి చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. స్థానిక పార్వతీపురం మన్యం సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది, సోలార్ వెండార్లతో సౌర విద్యుదీకరణ (యూఎల్ఏ) ప్రగతిపై ఆయన మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ ఉద్యోగులు, వెండార్లు ఎదుర్కొంటున్న సాంకేతిక ఆటంకాలు, సందేహాలను అడిగి తెలుసుకున్న ఆయన.. వాటికి తక్షణ పరిష్కార మార్గాలు సూచించారు. పనుల్లో అలసత్వం వీడి, సమన్వయంతో అడుగులు వేస్తూ సౌర విద్యుత్ ప్రక్రియను లక్ష్యానికి అనుగుణంగా పరుగులు పెట్టించాలని దిశానిర్దేశం చేశారు. సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) పి.త్రినాథరావు, జనరల్ మేనేజర్ (నోడల్ ఆఫీసర్) కె.సత్యనారాయణ, సాంకేతిక ఈఈ డి.పురుషోత్తం, పాలకొండ ఈఈ కె.విష్ణుమూర్తితో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.


