విజయనగరం ఫోర్ట్: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన నమోదు, క్షేత్ర స్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ పక్రియలను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కొత్త పింఛన్లు దరఖాస్తులను స్వీకరించి ప్రాధమిక వివరాలను పరిశీలించి ఎస్జీఎస్డబ్ల్యూ న్యూ పెన్షన్ సర్వీసులో ఆన్లైన్లో నమెదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తు విజయవంతంగా నమోదు చేసిన వెంటనే దరఖాస్తుదారునికి సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అకనాలెడ్జ్మెంట్ అందజేయాలన్నారు. ెఈ నెల 17 నుంచి 21 వరకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు వార్డు వేల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శులు అర్హత కల్గిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి అర్హత ప్రమాణాలు, సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించి, భౌతిక పరిశీలన నివేదికను నమోదు చేయాలన్నారు. దరఖాస్తు ఈకేవైసీ పూర్తి కాని వారి నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన సమయంలో ఈకేవైసీ తీసుకోవాలన్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తులను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఒంటరి మహిళల దరఖాస్తులను తహసీల్దార్లకు, నేత కార్మికులు, మత్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీ దారులు, తాటి చెట్టు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్ల వర్గాలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా స్థాయి అధికారులకు పంపించాలన్నారు. ఎంపీడీఓలు పింఛన్లను నేరుగా మంజూరు చేయరాదని, అర్హులైన దరఖాస్తులను సంబంధిత రాష్ట్ర స్థాయి లేదా సెర్ప్ అధికారులకు సిఫార్సు చేయాలన్నారు. పింఛను మంజూరు అయిన నెల నుంచే పింఛను చెల్లింపు ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి తదితరులు పాల్గొన్నారు.


