ఈ చిత్రాలు చూశారా... ఇవన్నీ విజయనగరంలోని దాసన్నపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందినవి. పనుల సాక్షిగా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల కల్పనపై చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘మన బడి–నాడు నేడు’ ఫేజ్–2 కింద 2022లో ఈ పాఠశాలకు 15 అదనపు తరగతి గదులను మంజూరు చేసింది. దీనికి రూ.1.75 కోట్లు అంచనా వ్యయం కాగా, తొలివిడతగా రూ.95 లక్షలు వెచ్చించి పనులను వేగవంతం చేసింది. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పాఠశాల పనులను పట్టించుకోవడం మానేసింది. విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ పాఠశాలకు శనివారం రావడంతో హడావిడిగా పనులు ప్రారంభించారు. ఓ వైపు ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశం అవుతుండగా, మరోవైపు ఆదరబాదరాగా సున్నంవేయడం, మైదానంలో ఇసుకు సర్దే పనులు చేపట్టారు. బాలికలను ఇబ్బందులకు గురిచేశారు. పూర్తికాని తరగతి గదుల్లోనే బాలికలను కూర్చోబెట్టారు. ఈ తంతును చూసిన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. రెండేళ్లుగా తరగతి గదుల పనులు ఊసెత్తని నారాలోకేశ్.. ఇప్పుడు తనను ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో గోడలకు సున్నం కొట్టే పనులు చేపట్టడంపై మండిపడ్డారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


