● తోటపల్లి కాలువపై సొంత నిధులతో
బ్రిడ్జి నిర్మాణం
● వెంచర్కు దారి కోసం కాలువ భూముల ఆక్రమణ
రైతుల విజ్ఞప్తిమేరకు అనుమతి...
తోటపల్లి కాలువలో బ్రిడ్జి నిర్మాణానికి రైతుల విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువను యథావిధిగా తిరిగి అప్పగించాలని, ఎలాంటి తేడాలు జరగకూడదనే నిబంధనతోనే అనుమతులు మంజూరు చేశారు. అనుమతి పత్రాలను బయిటకు ఇవ్వడం కుదరదు. కార్యాలయానికి వస్తే చూపిస్తాం.
– సుచిత్ర, డీఈ,
తోటపల్లి ప్రాజెక్టు, చీపురుపల్లి
చీపురుపల్లి: వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందేంచే తోటపల్లి కుడి ప్రధాన కాలువ ఓ రియల్టర్ చర్యలకు రూపం కోల్పోతోంది. 150 ఎకరాల వెంచర్కు వెళ్లే రోడ్లను తోటపల్లి కాలువ భూములు మీదుగా వేస్తుండడం, కాలువపై అక్రమంగా వంతెన నిర్మిస్తుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తోటపల్లి కుడి ప్రధాన కాలువ మిగులు భూముల్లో రెండు తట్టల మట్టి తీసుకెళ్లనివ్వని ఇంజినీరింగ్ అధికారులు... ఏకంగా కాలువలో బ్రిడ్జి నిర్మాణానికి ఓ రియల్ ఎస్టేట్ డాన్కు అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ పరిస్థితి...
చీపురుపల్లి మండలం రావివలస, గరివిడి మండలం శివరాం పంచాయతీ పరిసరాల్లో తోటపల్లి కుడి ప్రధాన కాలువ 103వ కిలోమీటరు వద్ద 150 ఎకరాల్లో ఓ రియల్టర్ రియల్ ఎస్టేట్ వెంచర్ సిద్ధంచేశారు. వెంచర్ను ఆనుకుని తోటపల్లి కుడి ప్రధాన కాలువ ఉంది. వెంచర్కు వెళ్లేందుకు దారిలేకపోవడంతో తోటపల్లి కుడి ప్రధాన కాలువపై నుంచి బ్రిడ్జి నిర్మాణం జరుపుతున్నారు. పూర్తిగా వ్యాపార లావాదేవీలుతో కూడిన రియల్ ఎస్టేట్ కోసం కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఇంజినీరింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా కాలువకు ఇరువైపులా భారీస్థాయిలో తవ్వకాలు జరుపుతూ కాలువ స్వరూపాన్ని మార్చేస్తుండడంపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తోటపల్లి కాలువకు ఇరువైపులా ఉన్న మిగులు భూములనే యంత్రాలతో చదును చేసి వెంచర్కు రోడ్లు వేయడం విమర్శలకు తావిస్తోంది.


