● ఆరోగ్యశాఖ మంత్రిని కోరిన
ఎమ్మెల్సీ సురేష్బాబు
నెల్లిమర్ల రూరల్: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల సమ్మెతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి విధుల్లోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విజయవాడలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. జూనియర్ వైద్యుల స్టైఫండ్ను కనీసం 20 శాతం పెంచడంతో పాటు బోధనా సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. గత 12 రోజులుగా జూని యర్ వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో అత్యవసర సేవలు సైతం నిలిపివేసి ఆందోళ ఉద్ధృతం చేశారన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రకేసరి ఆశయాలను స్మరించుకుందాం
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఆదివారం (ఆగస్టు 23న) జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు జరిగే వేడుకలకు అధికారులు, సిబ్బంది హాజరుకావాలని తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో, ప్రజా జీవితంలో ప్రకాశం పంతులు అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
మడ్డువలసలో విషసర్పం కలకలం
వంగర: మండల పరిధి మడ్డువలస ప్రధాన వీధిలో శనివారం విషసర్పం హల్చల్ చేసింది. ఇంటి ఆవరణలో పడగెత్తి ఉన్న సర్పాన్ని చూసి స్థానికులు హడలిపోయారు. కొందరు యువకులు దానికి నేర్పుగా తోటల్లోకి మళ్లించారు. మడ్డువలస బస్టాప్ నుంచి గ్రామంలోని పలు వీధుల్లో వీధి దీపాలు వెలగడంలేదని, విషసర్పాల భయం వెంటాడుతోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.


