పార్వతీపురం రూరల్: రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ప్రైవేట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30, 31 తేదీల్లో కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ కోశాధికారి గొర్లి వెంకటరమణ, మండల కన్వీనర్ బంకురు సూరిబాబులు మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ఆరు నెలలకోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నా, 2014 నుంచి అమలు కాకపోవడం వల్ల సుమారు 50 లక్షల మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా అంగనన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన, ఉపాధి తదితర స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల సాధనకు జూలై నెలంతా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు, వివిధ యూనియన్ల నాయకులు శివాని, వెంకటమ్మ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


