● జేసీ ఎస్.సేతుమాధవన్
విజయనగరం అర్బన్: ‘గుడ్ ఫర్ ప్రింటింగ్’ దశకు చేరిన పాస్ పుస్తకాలను సిద్ధం చేసి, జూలై నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ ఎస్.సుతుమాధవన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే, మ్యుటేషన్ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ సమావేశమందిరంలో మంగళవారం సమీక్షించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ, రికార్డుల ధ్రువీకరణ ప్రగతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా పట్టా దారు పాస్ పుస్తకాల ముద్రణ, పంపిణీ, ఈకేవైసీ కార్యక్రమాల పురోగతిపై సంతృప్తి వ్యక్తంచేశారు. భూ రికార్డుల మార్పులు, వారసత్వ బదిలీలు, కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, సర్వే ఏడీ విజయకుమార్, వర్చువల్ విధానంలో తహసీల్దార్లు హాజరయ్యారు.
రేపు డీఆర్సీ
విజయనగరం అర్బన్: రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఈ నెల 2న జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జరగనుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతుందన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్తోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారన్నారు.


