● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: అమరావతిలో కూటమి ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణకు పాల్పడుతోందని, రైతుల కష్టాలు వినేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం దాడులు చేయించడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని, చంద్రబాబు అరాచకాలకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అమరావతిలో రైతులు పడుతున్న కష్టాలు బయట ప్రపంచానికి తెలియనివ్వకూడదని, చంద్రబాబు చేసిన అవినీతి వెలుగులోకి రాకూడదన్న ఉద్దేశంతోనే దాడులు చేయిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికై నా వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు రాజకీయపార్టీలకు ఉంటుందన్న విషయం గమనించాలన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులకు ఉసిగొల్పడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఒకప్పుడు పోలవరంను ఏటీఎంగా వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరావతిని ట్రిపుల్ ఏటీఎంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి వైఎస్సార్సీపీ ఎప్పటికీ వెనుకడుగు వేయదని చిన్నశ్రీను ఆ ప్రకటనలో ఉద్ఘాటించారు.


