రేగిడి: జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నారు జనార్దనరావు మృతిచెందిన సందర్భంగా సోమవారం రేగిడి మండలంలోని సంకిలి గ్రామంలో జనార్దనరావు పార్థివదేహంపై రైతు సంఘం జెండా కప్పి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, విజయనగరం, పార్వతీపురం సీపీఐ కార్యదర్శులు ఒమ్మి రమణ, కూరంగి మన్మథరావులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కామ్రేడ్ జనార్దనరావు నీటి సంఘం అధ్యక్షుడిగా ఉంటూ సాగునీటి సమస్యలు, సంఘ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా చెరకు రైతుల సమస్యలపై పోరాటం చేసి రైతులకు ఎంతో మేలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో మన్యం జిల్లా అధ్యక్షుడు కిమిడి రామ్మూర్తినాయుడు, సీపీఐ రాజాం నియోజకవర్గ కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, సంఘ నాయకులు పాలవలస రామినాయుడు, పిట్ట రమణ, కర్రి పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.


