లక్కవరపుకోట: చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై ఒడిశాకు చెందిన గజేంద్ర బెహరా (31) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సీతారాంపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గజేంద్ర బెహరా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన దేవిని పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మండల పరిధిలోని పలు కంపెనీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది నెలల కిందట సోంపురం జంక్షన్ సమీపంలో గల అట్టల కంపెనీలో పనికి కుదిరి.. సీతారాంపురం గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో జీవనోపాధి నిమిత్తం అప్పులు చేశాడు. ఇతని భార్య దేవి కొద్దిరోజుల కిందట పుట్టింటికి వెళ్లగా.. గజేంద్ర ఒక్కడే ఉంటున్నాడు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో గజేంద్ర బెహరా ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. హెడ్కానిస్టేబుల్ పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..
కొత్తవలస మండలంలోని 202 కాలనీ సమీపంలో గల లెజెండ్ లే అవుట్లో గల తుప్పల్లో గుర్తు తెలియని పురుషుడు మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, ఐదారు రోజుల కిందట మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడా..? లేదా ఎవరైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం రూరల్: తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని మార్కొండపుట్టి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన విద్యార్థిని ఎ.సౌజన్య ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉగాది పండుగ సందర్భంగా తన తండ్రిని విధులు ముగించుకుని ఇంటికి త్వరగా రావాలని ఆమె కోరింది. ఈ క్రమంలో నువ్వు నాకు చెప్పవద్దు అని సౌజన్యను తండ్రి మందలించడంతో తీవ్ర ఆవేదనకు గురైన సౌజన్య ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలిపి తాగేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.
భవనంపై నుంచి జారిపడి కార్మికుడి మృతి
లక్కవరపుకోట: భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతాగొర్లెవానిపాలెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తవలస మండలం మింది రామచంద్రపురం గ్రామానికి చెందిన దాడి చిన్నప్పారావు (35) ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఏఎస్సై శ్రీనివాసరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నప్పారావు మండలంలోని సీతాగొర్లెవానిపాలెంలో ఓ భవనానికి డెకింగ్ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సహచర కూలీలు ఆయన్ను సమీపంలో గల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


