నెల్లిమర్ల రూరల్:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామ స్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువజామున స్వామికి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోని స్వామివారిని ఆశీనులను చేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, రుత్విగ్వరణం, తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి 7 గంటలకు స్వామివారిని రామతీర్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది పర్వదినం మొదలుకొని శ్రీరామ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేదపండితులతో శతసహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 27న శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వేడుకగా జరిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, పవన్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా ప్రారంభమైన
కల్యాణ వసంతోత్సవాలు
వేద పండితులతో శాస్త్రోక్తంగా
పారాయణాలు
ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం


