● రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం/విజయనగరం టౌన్:
పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయనగరం రాజమన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో జిల్లా యంత్రాంగం గురువారం ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పంచాంగ కర్త వారణాసి వెంకటనారాయణ ధర్మారావు శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ఉగాది పండగ ప్రజల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తెలుగు భాష, సంస్కృతులను భావితరాలకు అందించాలని, మన సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలని కోరారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధిసాధించాలని, మంచి వర్షాలు సకాలంలో కురవాలని, కర్షకులు, కార్మికులు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఆర్థికంగా, కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరారు. వేదపండితులు యర్రమిల్లి ప్రసాద శర్మ, అర్చకులు ఆరవిల్లి నరసింహమూర్తి, జయంతి వెంకట దుర్గా కామేశ్వర విశ్వనాథ్, నరసింగరావుకు అతిథులు పండిత సత్కారం చేశారు. మహారాజా సంగీత కళాశాల విద్యార్థినులు ఆలపించిన సంగీతకృతులు, ప్రార్థనా గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష, జిల్లా పర్యాటకశాఖ అధికారి లక్ష్మీనారాయణ, వ్యవసాయాధికారి తారకరామారావు, తదితరులు పాల్గొన్నారు.


