విజయనగరం అర్బన్: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన ఎలెక్సెంట్రా – 2026లో భాగంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్పోలో పట్టణానికి చెందిన సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో సీతం కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి అభించింది. కళాశాల ఈసీఈ విభాగానికి చెందిన బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు ఎం.హైమ, ఎస్.తేజశ్రీవల్లి, పి.అఖిల్, కె.శ్రీనివాసరావు బృందం ‘ఓపెన్ సివిని ఉపయోగించి వర్చువల్ డాష్బోర్డ్’ అనే వినూత్న ప్రాజెక్ట్ రూపొందించారు. కంప్యూటర్ వెబ్కెమెరా ద్వారా చేతి కదలికలను గుర్తించి సంబంధిత లోడ్లను పనిచేయించే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ సాంకేతికతను ముఖ్యంగా ఏటీఎంలు, పరిశ్రమలలో వినియోగించవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ఈసీఈ విభాగాధిపతి టి.దామోదరనాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసి అభినందించారు.
ముగిసిన ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ శిక్షణ
సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్’ అంశంపై వారం రోజుల పాటు నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితిగా హాజరైన ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి ఎస్.విష్ణువర్థన్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్, సిమ్యులేషన్ ప్రాజెక్ట్ల రూపకల్పనపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ శశిభూషణరావు ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వై.నరేంద్రకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.


