విజయనగరం క్రైమ్ : విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధి జొన్నగుడ్డిలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో ఈగల్ టీమ్తో పాటు విజయననగరం వన్ టౌన్, టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్వీకే చౌదరి, శ్రీనివాసరావు 150 మంది సిబ్బందితో బాలాజీ జంక్షన్ ఏరియా, జొన్నగుడ్డిలో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. ప్రతీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆధార్, రేషన్, గ్యాస్, కరెంట్ బిల్లులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జొన్నగుడ్డి ప్రాంతాన్ని 14 వీధులుగా విభజించిన పోలీసులు అణువణువు గాలించారు. ఎస్ఐ లీలావతి, నవీన్ పడాల్, కనకరాజు ఐదుగురేసి కానిస్టేబుళ్లుతో బృందాలుగా విడిపోయి ఇళ్లల్లో ఉన్న వారి ఆధారాలు సేకరించారు. జొన్నగుడ్డిలో రామమందిరం వద్ద నిర్మాణంలో ఉన్న రెండస్తుల భవనంలో రెండు రోజుల కిందటే కొందరు కుర్రాళ్లు గంజాయి సేవించి పంపకాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని అలెర్ట్ చేయడంతో పాటు గంజాయి సేవించిన స్థలాన్ని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే జొన్నగుడ్డి మహిళలతో ఏఎస్పీ సమావేశమయ్యారు. మీ ప్రాంతంలోకి అనుమానితులు వచ్చినా... అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, మద్యం సేవించినా, మత్తు పదార్ధాలు రవాణ జరిగినా తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీల్లో రికార్డులు సరిగా లేని 22 బైక్లను పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్బంధం చేశారు. ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, సారా వంటివి లభ్యం కాలేదని ఏఎస్పీ తెలిపారు. ఈగల్ టీం ఆర్ఐ టి.ధనంజయనాయుడు, విజయ్కుమార్, వన్ టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.


