● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి సుబ్బారావు
విజయనగరం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఆండ్ గ్రీవెన్స్సెల్ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది మహిళాశక్తి అని అన్నారు. ఏ పనినైనా ధైర్యంగా చేయాలని, కష్ట, నష్టాలను పోరాటపటిమతో ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉందని అన్నారు. సీ్త్ర ఎల్లప్పుడు సూర్యునిలా ప్రకాశవంతంగా ఉండాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అలాగే విశ్వవిద్యాలయం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రిజిస్ట్రార్ జి.జయసుమ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన విశాఖ జిల్లా కన్జూమర్స్ డిస్పూట్స్ రెడ్రస్సుల్ కమిషన్ సభ్యులు రహీమున్నీసా బేగం మాట్లాడుతూ విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యా ర్థినులకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు వి.లక్ష్మి, ఎం.రమ్య, బి.దేవి మాధవి, వివిధ విభాగాల అధిపతులు, ఆచార్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


