తప్పిన పెనుప్రమాదం
రాజాం సిటీ: నిత్యం రద్దీగా ఉండే పాలకొండ రోడ్డులో మంగళవారం చెరకు లారీ బోల్తాపడి పెనుప్రమాదం తప్పింది. సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరకును తరలిస్తున్న లారీని డ్రైవర్ పాలకొండ రోడ్డులో నిలుపుదల చేసి కిందకు దిగాడు. అదే సమయంలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి పడిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఆ సమయంలో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై లారీ ఉండిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి చెరకును తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. వారం రోజుల క్రితం రేగిడి మండలం బూరాడ వద్ద ట్రాక్టర్, చిన్నశిర్లాం జంక్షన్ వద్ద లారీ బోల్తాపడ్డాయి. పది రోజుల వ్యవధిలో ఇలా చెరకు తరలింపు వాహనాలు పడిపోవడంతో బాటసారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అధికలోడుతో వెళ్తున్న వాహనాలను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.
కర్రల లోడు లారీ బోల్తా
బొబ్బిలి: పట్టణంలోని రాయగడ రోడ్డులో పాత బొబ్బిలి వెళ్లే దారిలో దాబాల వద్ద సోమవారం వేకువజామున పెద్ద ప్రమాదం తప్పింది. పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్తున్న కర్రల లారీ బోల్తా పడిన సమయంలో నలుగురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడి భవనాల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం బైక్పై వస్తున్న ఇద్దరిని తప్పించే క్రమంలో కర్రల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రెప్పపాటులో వారిద్దరూ తప్పించుకున్న దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అలాగే బోల్తా పడిన ప్రాంతంలోనే ఓ వ్యక్తి తన కుమార్తెతో కలిసి దుకాణాల వద్ద ఉన్న గచ్చును తడిపే క్రమంలో పైపు మడత పడడంతో వెనక్కు వెళ్లారు. మడత విప్పి వచ్చేలోగానే లారీ పెద్ద శబ్దంతో బోల్తాపడింది. దీంతో వారు హతాశయులయ్యారు.
తప్పిన పెనుప్రమాదం


