సంగమేశ్వర దర్శనం.. ముక్తికి మార్గం
బలరాముడు
ప్రతిష్టించిన శివలింగం
సంగాంలో వెలసిన
సంగమేశ్వరస్వామి ఆలయం
వంగర: సర్వమత సమ్మేళనమే సంగమేశ్వరం. వంగర మండలంలోని సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ద్వాపరయుగంలో బలరాముడు ఏక కాలంలో నగావళి నదీ తీరం వెంబడి ఐదు శివలింగాలను ప్రతిష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అవి పాయకపాడు, గుంప, సంగాం, శ్రీకాకుళం, కళ్లేపల్లిలో ఉన్నాయి. ఇక్కడి ఆలయ కుడ్యాలపై దేవతా మూర్తులు విగ్రహాలు, గోడలపై విష్ణుమూర్తి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంగమేశ్వరస్వామి ఆలయ ప్రదేశంలో వేగావతి, నాగావళి, సువర్ణముఖి నదులు కలుస్తాయి. ఒకే చోట మూడు నదులు కలియడంతో ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా భక్తులు పిలుస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో నాలుగు వందల సంవత్సరాల నాటి భారీ మర్రి వృక్షం ఉంది. దీని నీడన వంటావార్పుచేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివరాత్రి ఉత్సవాలు ఏడు రోజుల పాటు జరుగుతాయని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బోను ఆనందరావు, ఈఓ పొన్నాడ శ్యామలరావు తెలిపారు. 80 మంది పోలీసులతో ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామని వంగర ఎస్ఐ షేక్ శంకర్ తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది
మంది భక్తులు తరలివచ్చే అవకాశం
మరో అలహాబాద్గా ఇక్కడ త్రివేణి
సంగమం ప్రసిద్ధి
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ
సంగమేశ్వర దర్శనం.. ముక్తికి మార్గం


